హరిః ఓం
మాతృ దేవో భవ! పితృ దేవో భవ!
ఆచార్య దేవో భవ!
జ్ఞానానంద మాయం దేవం నిర్మల
స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం
హయగ్రీవముపాస్మహే ||
సదాశివ సమారమ్భామ్ శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్ ||
గురవే సర్వ లోకానాం భిషజే భవరోగినాం
నిధయే సర్వ విద్యానాం దక్షిణా
మూర్తయే నమః ||
2021 సంవత్సరారంభంలో జగద్గురు శ్రీ ఆదిశంకరుల విరచితములు ఒకటి రెండయినా చదివి అర్థం చేసుకోవాలి అని అనుకున్నాను. శ్రీ శంకరుల భగవద్గీతా భాష్యం, బ్రహ్మ సూత్ర భాష్యం, వివేకా చూడామణి వంటి గ్రంధాలు కానీ, లేదా సౌందర్యలహరి, శివానందలహరి, దక్షిణామూర్తి స్తోత్రం వంటి స్తోత్రాలు కానీ ఆద్యంతము చదివి, ప్రతిపదార్థం తెలుసుకోవాలి అన్నది నా ఆలోచన.
వేదాంత సంబంధ పదాల అర్థం కానీ, వాటి అన్వయం కానీ, సంస్కృత భాష పై పట్టు కానీ లేకుండా ఈ అధ్యయనం ఎంత దుష్కరమో, శ్రీ ఆచార్య శ్రీ పుల్లెల రామచంద్రుడు గారి వివేక చూడామణి పరిచయం పుటలు చదివిన తరవాత కానీ నాకు అర్థం కాలేదు. అక్షరాలు రాని వాడు మహద్ గ్రంధాలు ఎలా చదవగలడు? అవి చదవే లేనప్పుడు, ఇంక వాటి భావార్థలు తెలుసుకోవడం ఎలా?
పోనీ వేద వాఙ్మయం ఏమైనా చిన్నదా?
నాలుగు వేదాలు. వాటి వాటి సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తులు.
శిక్ష,
కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యములు అనే వేదాంగములు.
న్యాయ,
మీమాంస, తర్క, ధర్మ శాస్త్రాలు, బహు పురాణాలు.
వాస్తు,
నాట్యము, ధర్మము, శిల్పము, సంగీతము, న్యాయము వంటి విషయాలను అత్యంత లోతుగా అధ్యయనము
చేయుటకు వాటి వాటి ప్రత్యేక శాస్త్రాలు.
ఏదైనా ఒక
విషయము, తత్త్వము, లేదా శాస్త్ర విధిని సూచించేవి సూత్రాలు. ఈ సూత్రాలు
ఒకటి రెండు శ్లోకాలు కలిగినవి అయినా కావొచ్చు, లేదా అతి విస్తృతమైన గ్రంధాలు కూడా
కావొచ్చు. ఉదాహరణకి బ్రహ్మ సూత్రాలు, సాంఖ్య సూత్రాలు, యోగ సూత్రాలు, నారద భక్తి
సూత్రాలు, గృహ్య సూత్రాలు, సుల్బ సూత్రాలు
వంటివి కొన్ని.
ఈ సూత్రాలలో కొన్ని వేదాలకి అనుసంధానం గా ఉంటాయి. ఋగ్వేదానికి ఆశ్వాలాయన, సాంఖ్య, శౌనక సూత్రాలు. సామ వేదానికి పుష్ప, నిధన, అనుస్తోత్ర సూత్రాలు. యజుర్వేదానికి వైఖానస, వరాహమైత్ర సూత్రాలు. అధర్వణ వేదానికి కుశిక సూత్రము వంటివి. ‘ఆశ్వాలాయన సూత్రః ఋగ్ శాఖాధ్యాయీ వంశీ కృష్ణ శర్మాణాం అహం భో అభివాదయే!’ లోని సూత్ర సూచన ఇవే.
ఒక శాస్త్రము లోని ప్రత్యేక విషయము చర్చించేవి ప్రకరణ గ్రంధాలు.
ఈ ప్రకరణలు ఏదైనా ఒక ప్రత్యేక పదము పై కానీ, లేదా ఒక విషయము పై కానీ చేసే విచారణ. ఇవి ఏక, పంచ, దశ, శత శ్లోక నిర్మితములై కానీ లేదా ఇంకా విస్తృతమయిన వివేకా చూడామణి, ఉపదేశ సహస్రి, ఆత్మ బోధ, తత్త్వ బోధ వంటి గ్రంధాలు అయి ఉంటాయి.
ఏదైనా ఒక విషయాన్ని ఐదు శ్లోకాలలో వివరించడం పంచ శ్లోకీ ప్రయోగం. కేవలం పంచ శ్లోకాలలో వివరించాలి కాబట్టి, ఎంచుకున్న విషయ సారాన్ని సూటిగా, టూకీగా చెప్పేవి ఇవి. సాధన పంచకం, కాశీ పంచకం, కౌపీన పంచకం, మనీషా పంచకం, మాయ పంచకం వంటివి పంచ శ్లోక ప్రకరణ ఉదాహరణలు.
ఈ విస్తృత వేద వాఙ్మయ అధ్యయనం ఎక్కడ మొదలు పెట్టాలి?
అధ్యయనం పద్దతిగా ఎలా చేయాలి?
అధ్యయనం చేసేటప్పుడు కలిగే అనుమానాల నివృత్తి ఎలా?
నేర్చుకున్నవి
పాటించడం ఎలా?
అందుకే గురు ముఖతః నేర్చుకోవాలి. గురు పాదాల వద్ద నేర్చుకోవాలి. గురువు యొక్క దిశానిర్దేశం పాటించాలి. గురు శుశ్రూష లేకుండా వేదాధ్యయనం సాధ్యము కాదు. ఆధ్యాత్మిక యాత్రలో మార్గదర్శిగా ఒక గురువు ఉండాలి. ఆ గురువు సద్గురువు అయి ఉండాలి. అటు వంటి గురువు దొరకడం చాలా దుష్కరం. ఒక్కసారి దొరికారా, ఇంకా వారి పాదములు వదలకూడదు. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ !
మరి ఏ ఇతర మాధ్యమాలు కూడా, గురువు లేని లోటును తీర్చలేవు.
దేశాకాల పరిస్థితుల ప్రభావం చేత ప్రత్యక్ష గురువు లేని నాకు, వివిధ ప్రవచనాలు, పుస్తకాలే గురువులు. వాటిని అందించిన మహాపురుషులకి నా పాదాభివందనములు.
ఇవి కేవలం
నా యొక్క జ్ఞాన సంచయానికి, విచారం జరపడానికి ఉపకరించే పుటలు. ఇందులో శాస్త్ర
విహితమయినవి గురు ప్రసాదములు. అలా కానివి నా స్వకపోల కల్పితములు.
విజ్ఞులు విశాల హృదయముతో మన్నించి, సూచనలు చేయుదురు గాక.
ఇందులో ‘నేను’ అని ప్రస్తావించిన చోట ‘ఆత్మ’ గురించిన విచారముగా భావించండి. అలా కాకుండా కేవలము నేను అని ఉన్న చోట, అది దేహ సూచన గా భావించండి.
***
వాక్య వివరణలు
అధ్యారోపము
ఒక వస్తువును మఱియొక వస్తువుగా భ్రమించడం. ఒక వస్తువు యొక్క గుణములను వేరొక వస్తువునందు చూసి, ఆ రెండవ వస్తువును మొదటి వస్తువు గా భ్రమించుట అధ్యారోపము.
- చీకటి లో తాడుని పాముగా భావించడం – రజ్జువు నందు సర్పత్వాధ్యారోపము.
- దూరముగా మెరుస్తున్న ముత్యపు చిప్పను వెండి ముద్దగా అనుకోవడం – శుక్తి యందు రజతత్వాధ్యారోపము.
- ఎండమావులందు నీటిని చూడటం – మరుమరీచికల యందు జలత్వాధ్యారోపము.
ఉపాదాన, నిమిత్తములు
అనేక దారముల యొక్క నిర్మాణము ఒక
వస్త్రము. మట్టి యొక్క రూపము ఒక కుండ. ఇక్కడ దారములు, మట్టి ఉపాదాన కారణములు.
వస్త్రమును నేయు వాడు, కుండను చేయువాడు నిమిత్త కారణములు.
కానీ ఈ సృష్టి యొక్క ఉపాదాన, నిమిత్త
కారణములు రెండూ కూడా ఆ పర బ్రహ్మ మాత్రమే.
అది ఎలా సాధ్యము? ఒక దారము, దాని అంతట అది ఒక వస్త్రమును నేయలేదు. మట్టి
ముద్ద తనంతట తానుగా ఒక కుండగా మారలేదు. మరి అటువంటప్పుడు ఒకే పరబ్రహ్మము ఉపాదాన,
నిమిత్తకారణములుగా ఈ ప్రపంచాన్ని ఎలా సృజిస్తున్నాడు? ఈ రెండు కారణములు ఒకనికే ఎలా
చెందుతాయి?
సాలె పురుగు తనలో నుండి పుట్టిన
దారముతో తన గూడు కట్టుకొని, ఆ దారమును మరలా తనలోకి ఎలా తీసుకుంటుందో, అలా
పరబ్రహ్మ, తన యందు పుట్టిన త్రిగుణాత్మికమయిన మాయతో కూడి ఈ ప్రపంచాన్ని
కల్పిస్తున్నాడు.
సాలె పురుగు యొక్క గూడు మిథ్య కాదు,
అది కేవలము తాత్కాలికము ( అసతః/అసత్తు). అలాగే ఈ ప్రపంచము మిథ్య కాదు. ఇది కేవలము
అసత్తు - తాత్కాలికము, ఆశాశ్వతము, అనిత్యము.
ఒక కార్యము తెలుస్తున్నది. దేనివలన ఆ కార్యము తెలుస్తున్నది? ఒక కారణము యొక్క ఘటనము వలన. కార్యము కేవలము కారణము వలనే సాధ్యము. కారణము యొక్క రూపము కార్యము లో ప్రస్ఫుటమవుతున్నది. కారణ వ్యతిరిక్తముగా కార్యము లేదు అనడం అపవాదము.
బంగారము తో చేయబడిన ఆభరణాలు, బంగారము లేకపోతే ఆ ఆభరణాలు లేవు. అవి బంగారము కన్నా భిన్నములు కావు.
మట్టి తో చేయబడిన కుండలు, మట్టి లేకపోతే వాటి అస్తిత్వం కోల్పోతాయి. అవి మట్టి తో కూడి ఉంటాయి.
అలాగే పరబ్రహ్మ లేదా పరమాత్మ నందు పుట్టిన ఈ ప్రపంచము, ఆ పరబ్రహ్మము కన్నా వేరు కాదు.
ఒక కుండ లో ఉన్న ఆకాశము (శూన్యము), బయట ఉన్న శూన్యము కన్నా వేరు కాదు. ఆ కుండ యొక్క రూపము మనము చూడటం వలన, ఘటాకాశము వేరుగాను, మహాకాశము వేరుగాను అనిపించుచున్నది.
ఘటాకాశము, మహాకాశము అని రెండు లేవు. ఉన్నది ఒక్కటే ఆకాశము. ఈ ప్రపంచము (దాని లో కూడిన నువ్వు) కూడా ఆ పరమాత్మ కన్నా వేరు కాదు.
****
కో హం
ఈ ప్రపంచము,
దానితో కూడిన ‘నేను’, పరమాత్మ కన్నా అభిన్నములైతే, మరి ఆ సంగతి నాకు ఎందుకు
తెలియడం లేదు?
ఈ ‘నేను’
కూడా ఈ ప్రపంచము లో ఒక భాగమే కదా. అయితే ఈ ‘నేను’ కూడా పరబ్రహ్మమేనా?
ఈ మానవ
శరీరమే నేనుగా ఈ లోకములో తిరుగుతోంది కదా. ఈ శరీరమే లేకపోతే, నాకు ఆస్తిత్వమే
లేదు. ఈ శరీరమే ‘నేనా’?
బంగారముతో
చేసిన ఆభరణములలో మట్టి ఉండదు. మరి నిత్యమయిన పరమాత్మ నుండి, అనిత్యము అయిన ఈ
శరీరము (మరియు ప్రపంచము) ఎలా పుడుతోంది? కాబట్టి ఈ శరీరము, ‘నేను’ వేరు అవ్వాలి.
అయితే ‘నేను’ (ఆత్మ) ఎవరు? ‘నా’ యొక్క నిజ స్వరూపము
ఏమిటో నాకు తెలియనివ్వకుండా ఎందుకు ఉంటోంది?
ఎంతటి లోతయిన, గంభీరమయిన విచారణ ఇది!
ఈ ప్రశ్నల
పరంపర కొనసాగిస్తే –
కా తే కాంతా కస్తే పుత్రః సంసారోఽయమతీవ విచిత్రః ।
కస్య త్వం వా కుత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాతః ।।
‘సోదరా (భ్రాతః)! నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము విచిత్రమయినది. నువ్వు ఎవరి వాడవు? నువ్వు ఎవరు? ఎక్కడ నుండి వచ్చావు?ఈ తత్త్వ విచారణ కొంచం చెయ్యు’
కస్త్వం కో హం కుత ఆయాతః కామే జననీ కోమే తాతః ।
ఇతి పరిభావయ నిజ సంసారం సర్వం త్యక్త్వా స్వప్న విచారం ।।
‘నువ్వు ఎవరు? నేను ఎవరిని? నేను ఎక్కడ నుండి వచ్చాను? నాకు తల్లి ఎవరు?తండ్రి ఎవరు? ఇలా విచారించి (ఆలోచించి) సారము లేని ఈ ప్రపంచము స్వప్నతుల్యంగా భావించి , ఈ సంసారమును (సంసారము పై మోహమును) విడిచి పెట్టుము’.
స్వాధ్యాయము, తపస్సు, నిరంతర సత్యాసత్య విచారము, ధ్యానము, వేదాధ్యయణము, గురు శుశ్రూష తో ఈ ప్రశ్నల సమాధాన్యములు సాధ్యమవుతాయి. అయితే ఎంతమంది ఆ మార్గములో ప్రయాణిస్తారు? వారిలో ఎందరికి జ్ఞానసిద్ధి కలుగుతుంది? వారిలో ముముక్షువులై జీవనం సాగించి, పరమాత్మ లో ఏకమయ్యేది ఎందరు?
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్
యతతి సిద్ధయే ।
యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం
వేత్తి తత్త్వతః ।।
‘వేల
కొలది మనుష్యులలో ఏ ఒక్కడో మోక్ష సిద్ధి కి ప్రయత్నిస్తున్నాడు. అలా
యత్నించినవారిలో ఎవరో ఒకడు మాత్రమే నన్ను యధార్ధముగా తెలుసుకోగలుగుతున్నాడు’
ప్రయాణం ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి! గమ్యం వైపు నడక సాగించాలి. ఇది జన్మాంతర ఆధ్యాత్మ ప్రయాణం. ఈ విచారణ జరగాలి. అరణి నుండి అగ్ని పుట్టినట్టు నిరంతర విచారణ తో జ్ఞానాగ్ని కణం ఒకటైనా పుడుతుంది. ఆ భగవదస్వరూప జ్ఞానముతో అనుభూతి కలుగజేసుకోవాలి.
మృగ స్వరూపము నుండి మానవ స్వరూప పరిణామము లో మన నిజ యత్నము ఏదీ లేదు. కానీ మానుష్య రూపము నుండి భగవద్స్వరూప పరిణామము మన చేతి లో ఉంది.
నాకు నేనుగా ఎన్నుకున్న మొదటి ప్రస్థానం, మాయా పంచకము.
References
శ్రీ తత్వవిధానంద సరస్వతి గారి మాయ పంచకము ప్రవచనం, వివిధ సత్సంగ ప్రశ్నోత్తరముల చలనచిత్రములు.
No comments:
Post a Comment