చిద్రూపము నందు జగదీశ జీవ భేదం
నిరుపమ నిత్య నిరంశకప్య ఖండే మయి చితి సర్వ వికల్పనాది శూన్యే |
ఘటయతి జగదీశ జీవభేదం త్వఘటిత ఘటనాపటీయసీ మాయా ||
వేఱొక
దానితో పోలిక లేనిదై, నిత్యమై, అఖండమై,
ఎటు వంటి వికల్పములు లేనిది అయినట్టి నా చిద్రూపము నందు, జీవ, జగదీశ భేదము
కలుగుతున్నది. ఇది త్వఘటిత ఘటనాపటీయసీ మాయా!
మయి చితి
నా (ఈ ఆత్మ)
యొక్క స్వరూపము చిద్. నేను చిద్రూపుడను. నీవెవరు అనే ప్రశ్నకి ఇదే సరైన సమాధానము.
ఇది కాకుండా ఇంక ఏదీ కూడా సమాధానము కాదు. సత్యము కాలేదు. ‘నేను ఒకరి తండ్రిని, పుత్రుడుని,
భర్తని ..’ – ఇవి ఏవీ కూడా నిజాలు కాదు. అహం అస్మి – అనునది ఒక్కటే సత్యము.
కానీ మన యొక్క ఈ చిన్మయ స్వరూపాన్ని అంత సులువు గా అంగీకరించలేము. మన యొక్క అస్తిత్వం, ఆనందం వేఱొకరిపై, లేదా వేఱు వస్తువు పై ఆధారభూతమయి ఉన్నాయి అని జీవిస్తూ ఉంటాము. నామ, రూపములకు అతీతముగా మనల్ని మనం ఆలోచించలేము. అంతెందుకు! భగవంతుని పూజిస్తున్నప్పుడు కూడా, ఏదో ఒక నామ, రూపములపై ధ్యాస ఉంచుతున్నాము తప్పా , వాటిని దాటుకొని, నికారామయిన పరబ్రహ్మ తత్వాన్ని గూర్చి ధ్యానించలేకపోతున్నాము.
నిరుపమ నిత్య నిరంశకప్యఖండే.
సరే, మయి
చితి! ఈ చిన్మయ స్వరూపం ఎటువంటిది?
‘నేను’ అనేది
ఈ జీవి యొక్క అనుభవము. ఈ ‘నేను’ అనే అనుభవమును ఒక్కటిగానే మనకి స్ఫురిస్తుంది.దానిని ఒక్కటి గానే మనము చెప్పగలము.
ఈ దేహము లో వివిధ అంగాలు ఉన్నాయి. అవి చేసే క్రియాల బట్టి వాటికి పేర్లు, అవి ఉన్న స్థలాల బట్టి వాటి లో ఇంకొన్ని అంతరాలు ఉన్నాయి. కొన్నింటికి మనం ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాం. మఱి కొన్నింటికి కొంచం తక్కువ ప్రాధాన్యత. కానీ ఈ దేహానుభవము మాత్రము ‘నేను’ అని ఒక్కటి గానే చెబుతాం. దేహము లో భాగాలు, విభాగాలు ఉండవచ్చు. ‘నేను’ లో అటువంటి భాగాలు ఉండవు.
ఈ దేహము ‘నేను’ కాదు కనుక, ‘నేను’ అను దానిని అలా విభాగించి చెప్పలేము. ఎటు వంటి అంశములు కల్పింప చేయలేము, కాబట్టి ఇది ‘నిరంశకము’.
ఈ ‘నేను’ ని ఖండించలేము. ఇది ఎటువంటి భాగములు లేనిది. కాబట్టి ఈ ‘నేను’ అఖండము. ఈ ‘నేను’ ఎల్లప్పుడూ ఏకము మాత్రమే. ఇందులో వేఱొక భాగము లేదు. ఉన్నది అది ఒక్కటే. భగవంతుడు ఉన్నాడు, ఈ ‘నేను’ ఉన్నది. కావున ఈ ‘నేను’, ఆ భగవంతుని కన్నా అభేదము కాదు. ‘అహం బ్రహ్మస్మి’!
ఈ ‘నేను’ ‘నిరుపమము’. ఒక దానిని ఇంకొక దానితో పోల్చి చెప్పడమే ఉపమానము. ఇక్కడ ఉన్నది ఒక్కటి మాత్రమే. రెండవ వస్తువు ఇంకేమీ లేదు. రెండవది లేనప్పుడు, ఇంక పోల్చి చూడడం జరగని పని. కాబట్టి ఇది నిరుపమము.
ఈ ‘నేను’ నిత్యము. ఏంటి? ఎలా? ఈ జన్మించి, పెరిగి, తిరుగాడి, మరణించే ఈ దేహము ‘నేను’ కాదు. ఈ దేహము ఒక ప్రక్రియ. అది క్షణక్షణానికి మార్పు చెందుతూ ఉంటుంది. కానీ మనం ఈ దేహమే నేను అనే అధ్యాస లో ఉంటాం. అందుకే ‘నేను <> సంవత్సరము లో పుట్టాను. నేను ఫలానా వారి బిడ్డని. నేను ఫలానా వారి దగ్గర పని చేస్తూ ఉంటాను. ..’ అని అంటూ ఉంటాము. ఇది నిజానికి వివిధ దేశ కాలాదుల పరిస్థితులలో ఈ దేహము యొక్క స్థితి మాత్రమే. పది సంవత్సరముల వయస్సులో ఉన్న ‘నేను’, ఇప్పుడు ఉన్న ‘నేను’ ఒక్కటే కదా? మార్పు చెందినది దేహమే కానీ ఈ ‘నేను’ కాదు. సత్యమయిన ‘నేను’ శాశ్వతము. నిత్యము. కాలాతీతము.
సర్వ వికల్పనాది శూన్యే
కల్పన అంటే
భ్రాంతి. ఒక చలన చిత్రములో జరిగే సంఘటనలు కల్పనలు. అవి ఏవీ కూడా నిజం గా జరిగినవి
కాదు.
మనిషి యొక్క
జీవితాన్ని మనం కొన్ని చిత్రపటాల సమాహారం గా చూస్తూ ఉంటాము. ‘ఇది నేను
పుట్టినప్పటిది అండి. ఇది నా చిన్నతనం లో తిరుపతి వెళ్ళినప్పటిది. ఇది నా
స్నేహితులతో పాటు విహార యాత్ర కి వెళ్ళినది. ఇది నా వివాహము లో కాశీ యాత్ర. వీరు
నా తల్లి తండ్రులు. వీరు నా భార్యా పిల్లలు. అప్పుడు నేను చాలా ఆనందము గా ఉన్నాను.
ఇది నాకు ఒక ప్రమాదం జరిగినప్పటిది. అప్పుడు నేను విచారము లో ఉన్నాను.’ ఇటువంటి వాక్యాలతో మనం ఆ చిత్ర పటాలని
తిరగవేస్తూ ఉంటాము.
ఈ ఘటనలు, బంధములు కేవలము మన మనస్సు, బుద్ధి కల్పించినవి. ఇవి కల్పనలు. మన మనస్సు చాలా అందమైన కల్పనలూ చేస్తుంది. భయానకమయిన ఆలోచనలూ కల్పిస్తుంది. ఆనందం కలిగించేది మనలోని మనస్సే. దుఃఖము కలిగించేది కూడా ఆ మనస్సే. ఈ ఘటనలు అన్నింటిలో మారని ఏదైనా ఉన్నదా? ఉన్నది. అదే ‘నేను’. వీటి లో ‘నేను’ ఉన్నాను. కానీ ఘటనలు కాలానికి బందీ అయిఉన్నాయి. కాలాతీతమయిన ఈ ‘నేను’ లో లేవు. ఈ వికల్పన శూన్యమయినది ‘నేను’.
అందుకే ఈ ‘నేను’ ఏమిటో తెలుసుకోవడానికి నిరంతర సాధన, అన్వేషణ అవసరం. కా తే కాంతా కస్తే పుత్రః! మనం ఈ జగత్తు లో దేనినీ సృష్టించడం లేదు. కేవలం ఒక సాధనముగా ఉంది, ఏవో కొన్ని కార్యాలు చేస్తున్నాము.
ఘటయతి జగదీశ జీవభేదం
‘నేను’
అహంకార భావన కాదు. ‘అహం అస్మి!’ , ‘నేను ఉన్నాను’ అన్నది ఒక్కటే. దానికి ముందు,
వెనుక పదాలు ఇంకేమీ లేవు. ఈ ‘నేను’, ‘పరమాత్మ’ వేరు కాదు. రెండూ ఒక్కటే.
ఘటః అస్తి – కుండ ఉంది. ఆకాశః అస్తి - ఆకాశం ఉంది. ఘటము వేఱు, ఘటాకాశం వేఱు , మహాకాశం వేఱు గాను చూస్తున్నారు. ఆ ఘటము, ఘటాకాశము యొక్క ఆస్తిత్వము మనలో నుండి వచ్చినవి. చూసే మనము, ఈ ఘటము, ఆకాశము ఒక సృష్టికర్త వలన జనించినవి. ఎవరు ఆ సృష్టికర్త? అదే ‘నేను’ (ఆత్మ).
పరబ్రహ్మ
నిత్య శాశ్వతుడు – సత్, చిత్, ఆనంద స్వరూపుడు. ‘నేను’ (ఆత్మ / జీవాత్మ) పరబ్రహ్మ
కన్నా భిన్నము కాదు కాబట్టి ఈ ‘నేను’ కూడా ఆ సచ్చిదానంద రూపమే. దేనితో గూడి
పరబ్రహ్మ ఈ ప్రపంచమును సృష్టిస్తున్నాడో, ఆ మాయ కూడా నిత్యమే. ‘జాయతే, గచ్ఛతే, ఇతి
జగత్’ – పుట్టేది (సృజించబడినది), వెళ్లిపోయేది ఈ జగత్తు. అది ఆశాశ్వతము.
ఈ నేను (ఆత్మ) నిరుపమానము, నిత్యము, నిరంశకము, అఖండము, సర్వ వికల్పనాది శూన్యము అయిన చిత్ స్వరూపము. అయినప్పటికీ, దీని యందు జీవుడు వేరు, జగదీశుడు వేరు అను భావన పుడుతున్నది (ఘటయతి జగదీశ జీవభేదం). ఈ అఘటిత ఘటన మాయ యొక్క శక్తి కాక మరి ఇంకేమిటి!
No comments:
Post a Comment