Friday, April 5, 2019

కొల్లేటి జాడలు !

కొల్లేరు గురించి వార్తల్లో  వినడం తప్ప నేను ఎప్పుడూ చూడలేదు. అది కూడా చిన్నప్పటి వార్తల్లో కొల్లేరు పరిసరాల్లో విడిది చేసే వలస పక్షుల కోసం, కొంచం పెద్ద అయినా తరవాత ఆ సరస్సు తరిగిపోతోంది అన్న సంగతులే తప్ప ఇంకేమీ తెలీదు.

అలాంటి నాకు దేశం కానీ దేశం లో, వాషింగ్టన్ రాష్ట్రం లోని Redmond నగర గ్రంధాలయం లో 'కొల్లేటి జాడలు' కనిపించాయి. నాకున్న మిడిమిడి జ్ఞానంలో ఆ రచయిత గారి పేరు ఎదో సినిమాలకి సంబంధించింది గా అనిపించింది.  గూగులమ్మని అడిగితే  "నిజమేరోయ్! భద్రం కొడుకో" అంది. 

సరే చూద్దాం అని ఇంటికి తెచ్చి చదివితే,  అక్కినేని కుటుంబ రావు గారు నా చెయ్యి  పట్టుకొని పులపర్రు వీధుల్లోకి తీసుకొని వెళ్లి నిలుచో పెట్టేసారు. అంతటి తో ఆగకుండా శుక్రవారం సంతల్లోకి , సంక్రాంతి సినిమాలకి తిప్పేశారు. గబుక్కున కింద చూస్తేనేమో  కొల్లేరు ఊరి ని ముంచి వెళ్ళిపోయిన తరవాత మిగిలి బురద అంతా కాళ్ళకి అంటుకొనిపోయి ఉంది.  రంగయ్య గారు, మధు , శీనుగాడు,పొట్టాడు, లక్ష్మమ్మ, మురళి - మిగిలిన వాళ్ళతో పాటు చుట్టుముట్టేశారు.

పెద్దలు పెట్టిన  కుస్తీ పోటీలో పోటా పోటీ కొట్టుకున్న శీను గాడు, పొట్టాడు కోసం చదువుతూంటే, చిన్నప్పటి స్నేహాల్లో గిల్లి కజ్జాలు గుర్తుకు వచ్చాయి . ఎంత సరళం గా ఉండేది బాల్యం! ఎంత నిష్కపటం!

" ఒళ్ళంతా దుమ్ము, చెమటలు, అక్కడక్కడా చిన్న దెబ్బలు. ఐతే  మాత్రం ఏం? నోటి నిండా బెల్లం గడ్డ , భుజం మీద పొట్టాడి చెయ్యి. ప్రపంచంలో శీను గాడికి ఏ అన్యాయమూ  కనిపించలేదు. తనకన్నా అదృష్టవంతుడు  ఎక్కడా ఉండదు అనే  భావం వంటిది, వాడి మనసు నిండా నిండిపోయింది.  పొట్టాడి కసలు  ఏ గోలా లేదు. పక్కన శీను ఉంటే చాలు వాడికి. ఇద్దరి నవ్వులతో కొల్లేట్లో కాలువ పూలు పోటీ పడలేక పోయాయి."


"కొల్లేరు వాళ్ళకొక కమ్మటి జ్ఞాపకం, వర్తమాన విషాదం! అంతే !" అన్న ముగింపు వాక్యాలు
మానవుల అత్యాశ ప్రకృతి ని మాత్రమే నాశనం చెయ్యలేదు - ఒక చక్కని శ్రామిక జీవన విధానాన్ని, ఆ సౌందర్యాన్ని , మనుషుల మధ్యన ఉన్న ఆప్యాయత, అనుబంధాల్ని కూడా ఎలా పోగొట్టిందో చెప్తాయి. ఆ మాటల్ని ఇంకో రకం గా చూస్తే ఊర్లు వదిలి, దూర ప్రదేశాల్లో, దేశాల్లో ఉన్నవారు సొంత ఊర్ల వైపు అలాగే చూస్తారు కదా అనిపించింది  - మనస్సు వదలని కమ్మటి జ్ఞాపకం,  కనిపిస్తున్నా అందని వర్తమానం  వలన కలిగే విషాదం.

ఆ పుస్తకం చదవడం అయిపోయిన తరవాత రెండు పెద్ద కల్లేకాయలు  తిని, సముద్రం లాంటి కొల్లేటి నుండి  ఒక్క గుక్కెడు నీళ్లు గొంతు లో పోసుకొని,  ఆ ఒడ్డున నిలుచుంటే పలకరించి  వెళ్తున్న పిల్ల గాలి తెమ్మెర తో పాటు , పశువుల్ని ఇళ్ళకి  తోలుకొని వస్తున్న కమ్మ రాజుల పిల్లల ఆట పాటలు,  మావులలో చేపలు పట్టుకెళ్తున్న వడ్డిరాజులు చేస్తున్న శబ్దాలు , నత్తలు ఏరుతున్న వడ్డీల పిల్లల గోల  కొన్ని రోజుల పాటు వెంటాడాయి.

Thursday, April 4, 2019

ఆదిశంకరుల మాతృ పంచకం

ఒక ఫేస్బుక్ పోస్ట్ నుండి. నా సొంత  ఆర్టికల్ కాదు. 


కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యా౦బ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తరక్రియలు చేశారు. ఆ సందర్భం లో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి.


1 .ముక్తామణిస్త్వం నయనం మమేతి

రాజేతి జీవేతి చిరం సుతత్వం 
ఇత్యుక్తవత్యా స్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కం.
తా:--అమ్మా! నీవు నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా వుండాలి. అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం
యిన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించు.



2 . అంబేతి తాతేతి శివేతి తస్మిన్

ప్రసూతి కాలే యాదవోచ వుచ్యై :
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జననై రచితోయమంజలి.


తా:--పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే బాధను ఆపుకోలేని బాధను "అమ్మా! 
అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.


3 . అస్తాం తావదియం ప్రసూతి సమయే

దుర్వార శూలవ్యథా నైరుచ్యం
తను శోషణం మలమయీ శయ్యాచ
సంవత్సరీ ఏకస్యాపినగర్భభార భరణ క్లేశస్య
యస్యాక్షమః దాతుం నిష్కృతి
మున్నతోసి తనయ:తస్యై జననై నమః


తా:-- అమ్మా! నన్ను కన్న సమయం లో నువ్వు ఎంతటి శూల వ్యథను అనుభవించావో కదా! శరీరం కళను కోల్పోయి శుష్కించి వుంటుంది. మలముతో శయ్య మలినమైనా 
ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా!ఎవరూ అలాంటి బాధను భరించలేరు.ఎంత గొప్ప వాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా?నీకు నమస్కారం చేస్తున్నాను

4 . గురుకులముపసృ త్యస్సప్న కాలేతు దృష్ట్వా

యతిసముచితవేషం ప్రారుదోత్వముచ్చె:
గురుకుల మథ సర్వ౦ ప్రారుదత్తే సమక్షం
సపది చరణ యోస్తే మాతరస్తు ప్రణామః

తా:--కలలో నేను సన్యాసి వేషం లో కనబడేసరికి బాధపడి, మా గురుకులానికి వచ్చి ఏడ్చావు. ఆ సమయం లో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్ప దానివైన నీ పాదాలకు నమస్కరిస్తుంన్నాను.


5 . న దత్తం మాతస్తే మరణ సమయే

తోయమపివా న్యథా నా నో దత్తా మరణ దివసే
శ్రాద్ధ విధినా న జప్త్యా మాతస్తే మరణ సమయే
తారకనామ మనురాకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురు తులామ్

తా:--అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు 
కూడా నేను గొంతులో పొయ్యలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి "స్వధా ను" యివ్వలేదు . ప్రాణము పోయే సమయము లో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కానీ దయ చూపించుము తల్లీ