Friday, April 28, 2023

మాయా పంచకం - 3: భవ సాగర భ్రమణం

భవ సాగర భ్రమణం

సుఖచిదఖండబోధ  మద్వితీయం వియదనలాది  వినిర్మితే  నియోజ్య

భ్రమయతి  భవసాగరే  నితాంతం త్వఘటిత  ఘటనాపటీయసీ మాయా ||

సత్, చిత్, ఆనందమయము, అఖండము, అద్వితీయము అయిన ఆత్మ ను, అది పంచ భూతాత్మకమయిన శరీరముగా భావింపచేసి, నిరంతరము ఈ భవ సాగరములో తిరగడమనే ఈ అఘటిత ఘటన మాయ యొక్క బలీయమయిన శక్తి! 

సుఖచిదఖండబోధ  మద్వితీయం

‘నేను’ (ఆత్మ) యొక్క స్వరూప వివరణము సత్, చిత్, ఆనంద స్వరూపము.

ఈ ‘నేను’ నిత్యము (సత్). ఇది ఆనంద స్థితిలో ఉంటుంది. అంటే నిరంతర సుఖ స్థితి లో ఉంటుంది. కానీ ఇది దుఃఖ స్థితిలో ఎందుకు చూస్తున్నాము? బాహ్య వస్తువుల వలన. అది ఎలా?

బాహ్య వస్తువు యొక్క ఉనికి చేత మనకి దుఃఖము కలుగదు. ఆ వస్తువును కావాలనుకోవడం, దాని యందు సుఖాన్ని చూడటం, ఆ వస్తువు అలభ్యమయినప్పుడు బాధ పడటం, అది వేరొకరికి దొరికినప్పుడు వారి యందు ఈర్ష్య భావము ఇత్యాది వికారముల వలన దుఃఖము కలుగుతున్నది. వీటినే రాగా ద్వేషములుగా చెప్పవచ్చు.

అంటే నిరంతర సుఖ స్థితి లో ఉండే  ‘నేను’, ఆ సుఖము యొక్క అన్వేషణ ‘నా’ లో చేయకుండా, దానిని బాహ్య వస్తువులకు ఆపాదించి, వాటి యందు మమేకమయి, ‘నా’ లోని సుఖమును మరిచి, దాని కొరకు వేరొక దానిపై ఆధారపడుతున్నాను.

ఆ ‘నా’ లోని సుఖ స్వరూప అన్వేషణమే  ఆత్మ విచారము. ఈ రాగ ద్వేషములు, బాహ్య ప్రపంచము లేనప్పుడు ఈ ‘నేను’ యొక్క స్వరూపము ఏమిటి అన్నదే ఆత్మ విచారము.

కో అహం!

ఎటువంటి ఆలోచనల చలనం లేకుండా, బాహ్య వస్తువుల అస్తిత్వ భావన లేకుండా, ఒక ప్రశాంతమయిన స్థితి కలిగినప్పుడు ఉన్నదే ఈ ‘నేను’. ఆ ఆలోచనల స్తంభనయే సంసార విముక్తి. ఆ ఆలోచనల స్తంభన ప్రక్రియయే ధ్యానం.  అటు వంటి స్థితి లో భావనయే  ‘అహమస్మి ’. ‘నేను’ తప్ప వేరొకటి లేదు. ‘నేను’ మాత్రమే ఉన్నాను. అలా ‘నేను’ మాత్రమే ఉన్నాను అన్నదే ‘నా’ (ఆత్మ) యొక్క నిజ స్థితి – సుఖ, ఆనంద స్థితి.

‘నా’ నిజ స్థితి సుఖ, ఆనందమయితే, మరి దుఃఖమయముగా ఎందుకు అనుభవము అవుతున్నది? అదే మాయా ప్రభావము!

చిత్

చిత్ అంటే స్పృహ, ఎరుక, జ్ఞానము. “నేను ఉన్నాను. నేను చూడగలను. వినగలను. నడవగలను. రుచి చూడగలను. నాలో ఆలోచనల పరంపర ఉంది. సుఖదుఃఖానుభవము ఉంది.” ఇటువంటివి ఉన్నాయి అన్న స్పృహ ఎక్కడ ఉన్నది? మనస్సు లో ఉన్నది. ఆ ‘స్పృహ’ యే ‘నేను’. అదే చిత్.

“నేను ఇక్కడ ఉన్నాను. అక్కడ లేను” అని అన్నప్పుడు, ఆ విషయము నీకు ఎలా తెలిసినది? క్షేత్రములో (లేదా అంతరము లో),  ఒక శరీరము ఆక్రమించిన స్థలము యొక్క జ్ఞానము నీ యందు కలుగుటచే తెలిసినది.

అది ఎలా తెలిసినది ? ఆ శరీరము నీవు కాదు కాబట్టి. ఆ శరీరమే నీవైనచో, దాని యొక్క బిందుస్థానములు నీకు తెలిసే అవకాశము లేదు.  స్థలకాలాదుల పరిమితులలో ఆ శరీరము యొక్క ఉనికిని తెలుసుకున్నది ఏదైతే ఉందో అది నీవు. అదే నీ యొక్క స్పృహ, ఎరుక, -  చిత్.

ఆ చిత్ అపరిమతము, సర్వవ్యాపకము. ఎందువలన? క్షేత్రాగణితము లో ఒక క్షేత్రము తీసుకున్నప్పుడు, అందులో స్థిర స్థానము నుండి బిందుస్థానములు నిర్ణయించడం కేవలం ఆ క్షేత్రానికి అభిన్నముగా ఉన్నప్పుడే సాధ్యము. నీకు ఈ ప్రపంచములో నీ శరీరము యొక్క స్థితి తెలియుచున్నది అంటే, నువ్వు ఆ శరీరానికి, ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచం ఉన్న సృష్టి కి అభిన్నముగా ఉన్నావు. అది కేవలం ‘నువ్వు’ (చిత్) అపరిమితమయి, సర్వ వ్యాపాకము ఐనప్పుడే సాధ్యము. 

అఖండమద్వితీయం

‘నేను’ అఖండము. ఆత్మస్వరూపము సుఖ, చిత్ స్వరూపము అని పైన తెలుసుకున్నాము. సుఖము ఉన్నది – దుఃఖము లేదు. అంతటా ‘నీవే’ ఉన్నావు. అన్నీ ఒకే వస్తువు అయినప్పుడు, ఆ వస్తువును విభాగించడం జరగదు. దానిని ఖండ ఖండాలుగా చూడలేము. అందుకే ‘నేను’ అఖండము. ‘నేను’ అద్వితీయం.

తెలుసుకుంటున్నవాడు జ్ఞాత, తెలియబడుతున్న విషయము జ్ఞేయము. ఇవి రెండూ జ్ఞానము నుండి పుడతాయి. చూచుచున్నవాడు వాడు ద్రష్ట, చూడబడుచున్నది దృశ్యము. ఇది దర్శనము వలనే సాధ్యము. ‘నువ్వు’ జ్ఞాతవా? ద్రష్టవా? రెండూ కాదు. ‘ద్రష్ట’ అని ఒకడు లేనప్పుడు, ‘జ్ఞాత’ అని ఒక పదవి లేనప్పుడు కూడా ‘నువ్వు’ కలవు. దర్శనము లో ‘నువ్వు’ లేవు. జ్ఞేయము లో కూడా ‘నువ్వు’  లేవు.  జ్ఞేయదృశ్యవిహితముగా ‘నువ్వు’ గలవు. కాబట్టి ఆ ‘నువ్వే’  జ్ఞానము, దర్శనము.

‘నా’ నిజ రూపము సుఖచిదఖండమయినప్పటికీ పెరిగిన, మసులుతున్న  ఈ ప్రపంచం ఆ భావన కలుగనివ్వదు. ప్రతీదాని యందు రాగమో, ద్వేషమో ఉండాలని పెరుగుతాం. ఒక వస్తువును అభావముగా చూడడం చాలా అరుదు. ఈ భావన చాలా అలవోకగా ‘చిట్టీ! నీకు నాన్న ఇష్టమా? అమ్మ ఇష్టమా?’ లాంటి చిన్న అమాయకపు ప్రశ్న దగ్గర మొదలవుతుంది. 

రాగద్వేషాలే కాదు, బయటి వారు లేదా వస్తువులు మనల్ని ఏదో చేస్తారనే భయముతో ఉంటాం.  ఈ రాగద్వేషాలు, భీతి, నామ రూప విభేదాలు పరమాత్మ రూపాలుగా మనం భావించి పూజించే విగ్రహాల దగ్గర నుండి, ఖగోళ గ్రహాల వరకు, చివరికి నిర్గుణుడు అయిన ఆ పరబ్రహ్మకి కూడా ఆపాదిస్తాం. ఫలానా గ్రహానికి శాంతి చేయాలి, ఫలానా దేవుడికి అభిషేకం చేయాలి, ఫలానా చోట ఉన్న గుడికి ప్రదక్షిణలు చేస్తే ఏదో మంచి జరుగుతుంది, అలా చేయక పోతే కీడు జరుగుతుంది అని వివిధ వ్యవహారాలు నడుపుతూ, ప్రతీ దానికి భయపడే స్థితిలో జీవిస్తున్నాం. 

వీటికి ఊర్ధ్వముగా ఎదగడానికి ప్రయత్నించాలి.  ‘నేను’ సుఖచిదఖండస్వరూపము అన్న జ్ఞానము మనకు ఆ స్థితి ని కల్పిస్తుంది. 

ఈ సుఖచిదఖండ అద్వితీయమైన స్వరూపమును మనం మాయ యొక్క ప్రభావము చేత మరచి, ఏమవుతున్నాము? 

వియదనలాది  వినిర్మితే  నియోజ్య భ్రమయతి  భవసాగరే  నితాంతం

దేహాధ్యాస, దేహధర్మాధ్యాస చాలా లోతుగా మనలో పాతుకొని ఉంటాయి. ‘ఈ దేహమే నేను. ఈ దేహము యొక్క గుణ ధర్మములు నావి’ అన్న ఆలోచన నిజం కాదు అని మనం అస్సలు అంగీకరించలేము. మనం పాటించే వీధి విధానాలు, ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి అటు వంటివి.

ఒక ఉదాహరణ .

మనం పాటించే దైనందిన కర్మలలో ఈ దేహం శుచి అయితే, ‘నేను’ కూడా శుచి. దేహం అశుచి అయితే, ‘నేను’ కూడా అశుచి. ఇక్కడ ‘నేను’ (ఆత్మ) శుచిగా ఉందా లేదా అన్న ప్రసక్తి ఉండదు. దూర ప్రదేశాలలో సంభవించిన జ్ఞాతుల మరణ వార్త వలన కూడా ఈ దేహానికి అశుచి ఏర్పడుతుంది. అలా కర్మ కాండ అంతా దేహము చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ఇది దేహాధ్యాస ను దూరంగా ఎలా ఉంచుతుంది?

మరొక ఉదాహరణ.

ఒక వ్యక్తి యొక్క ఛాయాచిత్రం ఒకటి తీయించి, ఆ చిత్రం లోని రూపాన్ని ఆ వ్యక్తికి ఆపాదిస్తాం. అంతెందుకు మన ఛాయాచిత్రం తీసుకొని, ‘ ఈ చిత్రం లో నేను బాగున్నాను. ఇందులో నేను కనబడటం లేదు. ఇందులో నీనెక్కడో చూస్తున్నాను.’ అని అంటాం. ఆ చిత్రం లో ఉన్నది నిజంగా మనమేనా? మనం ‘దృశ్యం’ కాదు కదా? అయినా సరే దేహాధ్యాస మనలని వేరే విధంగా ఆలోచించనివ్వదు. 

మన కన్నులతో ఒక చైతన్య స్వరూపాన్ని జడము లో చూస్తూ, మనస్సు, బుద్ధుల సంయోగముతో ఆ జడముకు ఒక రూపాన్ని కల్పించి, చైతన్యవస్తువు గా భ్రమించి, మన తలపుల్లో బంధిస్తాం. రోజూ మార్పు చెందుతున్న దేహం, మనస్సులో బంధించిన రూపం ఒకటి కాదు. ఈ భ్రమ మనం తీసే ప్రతీ ఛాయాచిత్రంతోనూ పెరుగుతూనే ఉంటుంది.

చివరి ఉదాహరణ.

ఈ మధ్య హోమములు, యజ్ఞములు చేయడం చూస్తున్నాము. అలా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న అగ్నికి ఛాయా చిత్రం తీసి,  ఆ అగ్ని కీలలలో ఏదో దేవతా స్వరూపమనో, ఆ హోమ ధూమములో గురు స్వరూపమనో ప్రచారం చేయడం చూస్తున్నాము. అలా మనకు మనమే ఒక భ్రమ కలిగించుకుంటున్నాం.

ధూమంలో కనిపించే రూపం మరుక్షణంలో మాయమవుతుంది. ఛాయా చిత్రం లోని రూపం కొన్ని రోజులకి మాయమవుతుంది. అలాగే మన దేహం కూడా ఎప్పుడో ఒకప్పుడు లయమవుతుంది. కానీ మాయ ప్రభావం ఎంతటిది అంటే సుఖచిదఖండమద్వితీయమయిన ఈ ‘ఆత్మ’ ని, పంచ భూతముల కలయిక అయి ఆశాశ్వతమయిన ఈ దేహము గా భావిస్తున్నాం. 

ఒక మనిషి మరణించినప్పుడు మనం నిజంగా ఆ మనిషిని కోల్పోతున్నామా?

అమ్మ వెళ్లిపోయినది.  ఆలోచించగా పోయినది కేవలం అమ్మ రూపము, దేహము అనే అనిపిస్తుంది. తన చైతన్యం నిత్యచైతన్యమయిన పరమాత్మ యందు కలిసింది, ఘటాకాశం మహాకాశం లో లయమయినట్లు. తన ఆలోచనలు, భావనలు నాలోనే ఉన్నాయి.

నిజంగా తనను కోల్పోతే, తాను ఇంక లేదు అంటే, మరి నేను శ్రాద్ధ కర్మ ఎవరికి చేస్తున్నట్టు? మరణించిన వ్యక్తి ఉండేది పక్షి రూపము లోనో, జంతు స్వరూపము లోనో కాదు. పితృ దేవతారూపములో ఆరాధన చేస్తున్నప్పుడు, నేను ఆ లయమయిన చైతన్యాన్ని ఆరాధిస్తున్నాను. ఆ చైతన్యము నిత్యము, సత్యము. కనుక అమ్మని నేను కోల్పోలేదు. ఆ రూపాన్ని, ఆ రూపము పంచి ఇచ్చే ఆనంతమయిన ప్రేమని కోల్పోయాను.

నేను కోల్పోయినది నిరంతరము మార్పు చెందినదయి, జీర్ణమవుతున్న ఒక అనిత్య శరీరాన్ని. ఈ శరీర పతనం మన చుట్టూ ఉన్న మనుషులకు, మనకు కూడా జరుగుతున్నదే. కాలం క్షణముల రూపములో మన జీవితాన్ని హరిస్తోంది. తీసే ప్రతే ఊపిరి చివరి ఊపిరికి మనల్ని దగ్గరకి చేరుస్తోంది. ఏనాటికైనా ఈ శరీరం పతనం కావాలసినదే. కానీ మనం ఈ రూపం, దేహము నిత్యములు అన్న అసత్య భావన, భ్రమలో  ఉంటాం. ఆ భ్రమ లో బ్రతుకుతున్నప్పుడు, ఈ సత్యం ఎప్పుడో ఒకప్పుడు మనల్ని తట్టిలేపుతుంది. అప్పుడు ఆ సత్యాన్ని భరించడం కష్టం. అందుకే ఈ  భ్రమ దుఃఖ హేతువు.

సరే!  ఈ దేహము స్థిరం అనుకోవడమే భ్రమ. ఈ భ్రమ వలన 'భ్రమయతి  భవసాగరే  నితాంతం'.

స్వతహాగా సుఖ, చిద్ , ఆనంద రూపమైన ఈ ఆత్మని కాదని, మనం ఆ సుఖాన్ని, ఆనందాన్ని బయట ప్రపంచం లో వెతుకుంటాం. ఆ వెతుకులాట లో ఎన్నో సంబంధాలు , రాగ ద్వేషాలు , కామ క్రోధ లోభ మొహాలకు గురి అవుతాం. ఆ భ్రమయే , ఆ తిరగడమే మనం 'బాగోవడం' వెతుక్కుంటూ ఈ సంసారం లో పాడుతాం. ఈ అజ్ఞానం మనల్ని తిప్పుతోంది. భ్రమయతి. ఎక్కడ తిప్పుతోంది? సంసార చక్రం లో. ఈ చక్రం లో ఏముంది. సుఖదుఃఖాల సమాహారం ఈ సంసారం. దేహం నిత్యము అనుకోవడం వలన ఈ తిరుగుడు తప్పదు.

బాహ్య వస్తువును చూడటం ఒక ఎత్తు ఐతే, ఆ వస్తువు తో మమేకం చెందడం, ఆ వస్తువు మీద ఇష్టాఇష్టాలను ఆపాదించుకోవడం వలన భ్రమయతి, తిరుగుడు. ఆ వస్తువును కేవలం ఒక నిమిత్తంగా చూడగలిగితే, ఆ దృష్టి తో  సమస్త లౌకిక ప్రపంచాన్ని చూడగలిగితే  తామరాకు మీద నీటి బొట్టు లా బతకడం సాధ్యమవుతుంది. 

ఈ భావనని ఇంకా కొంచం పైకి తీసుకొని వెళ్దాం. 

‘ఇది నేను. ఇది నేను కాదు’. ‘ఇది నాది. ఇది నాది కాదు.’

ఈ భావనలు మనలోని అహం ని సూచిస్తాయి. అస్సలు నేను అన్న భావనే లేకపోతే? నాదీ అన్న అనుబంధమే లేకపోతే? అంటే పూర్తిగా ఈ ప్రపంచానికి, మనకి ఉన్న సంబంధాలు త్రెంచుకోమని కాదు. మనిషి సంఘ జీవి. సంఘంలో బ్రతుకుతున్న మనిషి కి కొన్ని కట్టుబాట్లు తప్పవు. కొన్ని బాధ్యతలు తప్పవు. అయితే ఆ బంధాలు, బాధ్యతలను కేవలం నిమిత్తంగా చూడలేమా?

కర్మలు చేస్తున్నప్పుడు, వాటి ఫలాపేక్షను వదలలేమా? అలా వదిలి ఉండలేకపోతున్నాము కాబట్టే ఈ భవ సాగరం లో నిరంతరము, జన్మ జన్మలుగా పరిభ్రమిస్తున్నాము. భ్రమయతి భావసాగరే నితాంతం!  

ఎందువలన?

అఘటిత ఘటనా పటీయసి మాయ!

No comments: